Jun 29,2023 20:08

కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - హోళగుంద
ఎల్‌వి.ప్రసాద్‌ నేత్రాలయ సౌజన్యంతో స్థానిక కన్నడ పాఠశాలలో ఆర్‌ఎంపి తిప్పయ్య నేతృత్వంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 50 మందికి పరీక్షలు చేశారు. 15 మంది ఆపరేషన్లు చేసుకోవాల్సిందిగా టెక్నీషియన్‌ జయలక్ష్మి, అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ మల్లికార్జున సూచించారు. మిగిలిన 35 మంది తగిన అద్దాలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఆర్‌ఎంపి తిప్పయ్య మాట్లాడుతూ... పేద, ధనిక అనే తేడా లేకుండా కంటి పరీక్షలు చేయించుకుని జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎల్‌వి.ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచితంగా జరిగే ఈ పరీక్షలను ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కోరారు. క్యాంపు కోఆర్డినేటర్‌ మాన్తీష్‌ పాల్గొన్నారు.