Aug 29,2022 20:32

ఏజెంట్ల సమావేశంలో మాట్లాడుతున్న జయ జయభారత్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎల్‌ఐసి ఏజెంట్ల హక్కులు కాలరాస్తే సహించేది లేదని లీయాఫీ కడప డివిజన్‌ అధ్యక్షులు జయభారత్‌ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఎల్‌ఐసి బ్రాంచి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయభారత్‌ రెడ్డి, జోనల్‌ నాయకులు కె.రమేష్‌ మాట్లాడారు. ఇన్స్యూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏజెంట్‌ హక్కులు కాలరాసే నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమని తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30 వరకు కేంద్ర ప్రభుత్వం, ఇన్స్యూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఎల్‌ఐసి యజమాన్యం నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాలసీదారుల ప్రీమియంపై జిఎస్‌టి వేయాలని, పాలసీదారులకు పాలసీలపై బోనస్‌ రేటు పెంచాలని కోరారు. పాలసీదారుడు తీసుకునే రుణంపై వడ్డీ రేటు తగ్గించాలని, ఐదేళ్ల ప్రీమియం చెల్లించిన పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని తెలిపారు. నిత్యావసర సరుకులు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంటే కమిషన్‌ను తగ్గిస్తామని పేర్కొనడం సమంజసం కాదన్నారు. ఏజెంట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, గ్రాట్యుటీ పెంచాలని కోరారు. గ్రాట్యుటీ లెక్కేసే విధానాన్ని మార్చాలని, గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ పెంచాలని తెలిపారు. గ్రూప్‌ మెడిక్లెయిం పెంచాలని, ఏజెంట్ల పిల్లలకు విద్యారుణం అందించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మిగనూరు బ్రాంచి అధ్యక్షులు వెంకటేశ్వర్‌ రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి జెకె.శివ రాముడు, డివిజన్‌ ఉపాధ్యక్షులు ఆంధ్రయ్య, ప్రెస్‌ అండ్‌ పబ్లిసిటీ ఛైర్మన్‌ బి.హరినాథ్‌, డివిజన్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ అనంతభూరళి, నాయకులు జయరాం, జిల్లా నాయకులు సోమన్న, డివిజన్‌ మాజీ నాయకులు రంగస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అలాగే కొత్తగా ఎన్నికైన డివిజన్‌ నాయకులు సన్మానించారు. బి.వీరేశ్‌, మోహన్‌, ప్రసాద్‌, ఆనందయ్య శెట్టి, బి.వెంకటేశ్వర్‌ రెడ్డి, మల్లికార్జున్‌ గౌడ్‌, హనుమంతరావు, ఫక్కీరప్ప, నారాయణ, ఎర్రినాథ్‌, అబ్దుల్‌ గఫూర్‌, దేవేంద్ర మూర్తి పాల్గొన్నారు.