
ప్రజాశక్తి- సరుబుజ్జిలి: సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపిసి విద్యనభ్యసించి రిలీవ్ అయిన ఇద్దరు విద్యార్థులు అగ్రికల్చర్ బిఎస్సిలో సీట్లు సంపాదించారని కళాశాల ప్రిన్సిపాల్ రాబిల్లి భూషణరావు సోమవారం తెలిపారు. మండలంలోని గోనెపాడుకు చెందిన గొండు సోమేశ్వరరావు కుమార్తె గొండు శ్రావణికి గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బిఎస్సిలో సీటు లభించిందన్నారు. ఈ ఏడాది సరుబుజ్జిలి ప్రభుత్వ కళాశాలలో బైపిసి చదివిన శ్రావణి 950 మార్కులు సాధించిందని తెలిపారు. మండలంలోని పర్వతాలుపేటకు చెందిన చిన్నాల శ్రీనివాసరావు కుమార్తె రిషితకు రాజమండ్రి ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సిలో సీటు లభించిందన్నారు. రిషితకు బైపిసిలో 940 మార్కులు వచ్చాయన్నారు. తమ కళాశాల విద్యార్థులు ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ బిఎస్సిలో సీట్లు సాధించడంపై అధ్యాపకులు రమేష్ సాహూ, విజయకుమార్, గొండు శ్రీనివాసరావు, రామకృష్ణ, వినోద్రాజు, గౌతమిలను అభినందించారు. గతేడాది కాంపిటీటివ్ సెల్ నిర్వహించిన పూర్వ అధ్యాపకులు గణపతి ధనుంజయరావు, చిన్నారావు, పూర్వ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దుగ్గివలస రాంప్రసాద్ సహకారంతో తాము పోటీ పరీక్షల్లో రాణించగలిగామని రిషిత, శ్రావణి తెలిపారు.