ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ఐఅండ్ పీఆర్ శాఖలో ఎఇగా జిల్లాలో పని చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లాకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పదోన్నతిపై వెళ్తున్న రామాంజనేయులు సేవలు వెలకట్టలేనివని ఐ అండ్ పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి కొనియాడారు. మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏఈగా పని చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లాకు ఏఈఈగా పదోన్నతిపై వెళుతున్న రామాంజనేయులుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐపిఆర్ఓ మాట్లాడుతూ 25 ఏళ్లుగా సమాచార పౌర సంబంధాల శాఖలో వివిధ స్థాయిలలో పనిచేసి ప్రస్తుతం ఏఈఈగా పదోన్నతి పొందిన రామాంజనేయులు ఎంతో కష్టపడి పని చేసే వ్యక్తి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శివ రామాంజనేయులు, సమాచార శాఖ అధికారి వి.సూర్యనారాయణరెడ్డి, పిఆర్ఒ సూర్యనారాయణరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ప్రభావతి, జూనియర్ అసిస్టెంట్ చాంద్బాషా, టైపిస్టులు దుర్గా సుహాసిని, దామోదర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎఇ రామాంజనేయులును సన్మానిస్తున్న ఐ ఆర్ అండ్ సిబ్బంది










