ప్రజాశక్తి-అనకాపల్లి
బేవరేజెస్ కంపెనీలో ఎగుమతి కూలి రేట్ల ఒప్పందం పూర్తయి ఏడాదవుతున్న నూతన ఒప్పందం, కూలి రేట్లు పెంచడం చేయలేదని, తక్షణమే కూలి రేట్లు పెంచాలని కోరుతూ అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ బేవరేజెస్ కంపెనీ ముందు కార్మికులు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హమాలీ యూనియన్ నాయకులు జీరు కనక రమణ, కరణం కొండలరావు, టి.రాజు, బి శ్రీను, సూరి నాయుడు, రాజేష్ ప్రసాద్ మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినా తమ కూలి రేట్లు మాత్రం పెంచలేదన్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్యం ఖర్చులు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇచ్చే కూలీ డబ్బులు చాలక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్యం పెట్టె ఒక్కంటికి రూ.8 చొప్పున పెంచాలని, హమాలీలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హమాలీలు పాల్గొని నినాదాలు చేశారు.










