May 04,2023 00:13

మాట్లాడుతున్న వర్శిటీ ఉపకూలపతి పి. రాజశేఖర్‌

ప్రజాశక్తి -ఎఎన్‌యు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే, కాలేజ్‌ డేల ఉత్సవాలు నిర్వహించారు. గ్రాడ్యుయేషన్‌ డే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన బెంగళూరు ఇస్రోలోని కెపాసిటీ బిల్డింగ్‌ అండ్‌ పబ్లిక్‌ ఔట్‌ రీచ్‌ డైరెక్టర్‌ ఎన్‌ సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యా ప్రమాణాలను నిత్యజీవితంలో సమాజ శ్రేయస్సుకై ఉపయోగపడే నూతన ఆవిష్కరణల కోసం విద్యార్థులు వినియోగించాలని తెలిపారు. ముఖ్య అతిధి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలిపారు. ఫిలిం మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీ యశ్వంత్‌ నాగ్‌ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం ఉత్సాహంగా ఉంటూ అన్ని కళలలోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో విద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య బి కరుణ, విశ్వవిద్యాలయ రెక్టార్‌ ఆచార్య పి వరప్రసాద్‌ మూర్తి ఇంజనీరింగ్‌ పట్టా తీసుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య పి సిద్దయ్య అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా ఆచార్య ఈ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ జి ప్రతిభ, డాక్టర్‌ ఎం శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.