
ప్రజాశక్తి - ఆకివీడు
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఆకివీడు ఎఎంసి ఛైర్మన్ పదవి ఎట్టకేలకు షేక్ రసూల్బిని వరించింది. బుధవారం సాయంత్రం రసూల్బితో సహా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసం లేదు ఆర్భాటం లేదు. ప్రశాంతంగా ఐదు నిమిషాల్లో మొత్తం కార్యక్రమం ముగిసింది. ఆమెకు గతంలోనే ఒకసారి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ పేరు మార్పు చేయడంతో మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఈ రకంగా చేసి ఉంటారని అందరూ భావిస్తున్నారు. కాళ్ల మండలానికి చెందిన గంటా ఆనందరావు ఉపాధ్యక్షుడిగా, మరో 15 మంది సభ్యులతో కొత్త కార్యవర్గం ఏర్పడింది. వీరికితోడు మరో ఇద్దరు అధికారులు ఇందులో అదనపు సభ్యులుగా ఉంటారు. డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.