* అసమానతలు రూపు మాపడమే ఆయనకు నివాళి
ప్రజాశక్తి-గుంటూరు, విజయవాడ సిటీ : సామాజిక అసమానతలను తొలగించడానికి కలం అనే ఆయుధంతో తిరగబడిన మహాకవి గుర్రం జాషువా అని పలువురు వక్తలు కొనియాడారు. గుర్రం జాషువా 50వ వర్ధంతిని గుంటూరు, విజయవాడలో శనివారం ఘనంగా నిర్వహించారు.
గుంటూరులోని జాషువా విగ్రహానికి రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్తోపాటు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కెఎస్.లక్ష్మణరావు, జంగా కఅష్ణమూర్తి, టి.కల్పలతా, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్, మొహ్మద్ ముస్తఫా, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, మధ్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ గుంటూరులో గుర్రం జాషువా కళాపీఠం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్మోమోహన్రెడ్డి రూ.3 కోట్లు కేటాయించారని, ఇందు కోసం గుంటూరు నడిబడ్డున, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 30 సెంట్ల స్థలాన్ని కేటాయించామని తెలిపారు. ఏడాదిలోగా కళాపీఠం పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ, గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో అవార్డులు అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామన్నారు. గుర్రం జాషువా సమాధి, ఆయన నివసించిన ఇంటిని స్మారకచిహ్నంగా మార్చాలని సిఎం దృష్టి తీసుకెళతామని పేర్కొన్నారు.
ఎంబివికెలో...
విజయవాడ ఎంబివికెలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యాన జాషువా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జాషువా చిత్రపటానికి ఎంబివికె ఇన్ఛార్జ్ బి.ఆర్.తులసీరావు పూలమాల వేశారు. ముఖ్య అతిథిగా ఎంబివికె ట్రస్ట్ చైర్మన్ పి.మధు హాజరై జాషువాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంబివికె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపడమే జాషువాకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి, బాధ్యులు డివి రాజు, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నాయకులు బికెఎన్ఎస్.ప్రసాద్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర కార్యాలయంలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి నటరాజ్ రాష్ట్ర సహాయకార్యదర్శి జి క్రాంతికుమార్ జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతూ ప్రజల్లో చీలికలు తీసుకొస్తుందని,. మతోన్మాద బిజెపి కుట్రపూరిత చర్యలను రాష్ట్ర ప్రజలంతా ఖండించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.