Nov 04,2023 17:12

చిప్పగిరిలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహిస్తున్న నాయకులు, ప్రజలు

ప్రజాశక్తి - చిప్పగిరి
తాగునీటి సమస్య జఠిలం కాకుండా తుంగభద్ర జలాశయం నుంచి ఆలూరు బ్రాంచి కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని మండల ప్రజలు డిమాండ్‌ చేశారు. వైసిపి మండల కన్వీనర్‌ జూటూరు మారయ్య, డేగలపాడు సర్పంచి నీలకంఠ ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజలు శనివారం చిప్పగిరిలోని బస్టాండ్‌ అంబేద్కర్‌ సర్కిల్‌లో ధర్నా చేపట్టారు. సాగు చేసిన పంటలకు, తాగేందుకు నీటికి వెంటనే విడుదల చేయాలని ప్రజలు దాదాపు 3 గంటలు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆలూరు, గుంతకల్లు రోడ్డుకిరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం వైసిపి కన్వీనర్‌ మారయ్య, సర్పంచి నీలకంఠ మాట్లాడారు. ప్రజలకు తాగునీటి సమస్య ఎదురవకుండా ఇరిగేషన్‌ అధికారులు చొరవ తీసుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. నీటిని సమస్యను పట్టించుకోకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నిరసన గురించి మంత్రి గుమ్మనూరు జయరామ్‌ దృష్టికి వెళ్లడంతో వెంటనే మంత్రి జయరామ్‌ హంద్రీనీవా నుంచి ఎల్‌ఎల్‌సి కాలువకు సోమవారం నుంచి నీటిని విడుదల చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు, ప్రజలు ధర్నాను విరమించారు. కో ఆప్షన్‌ సభ్యులు సర్వర్‌ ఖాన్‌, లాలూ స్వామి, సేనాపతి, జూటూరు లింగన్న పాల్గొన్నారు.