సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ
ప్రజాశక్తి-విఆర్.పురం
రైతు నుంచి ధాన్యం కొనుగోలు తక్షణమే నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని పెద్ద మట్టపల్లి రైతు భరోసా కేంద్రంలో ధాన్యాన్ని గురువారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఎండకు ఎండి, వానకు తడిసి, ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోగా, టార్గెట్ల పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యాన్ని పశువులు, మేకలు, పందులు తింటున్నాయని, అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్, సర్పంచ్ పూనెం సరోజిని, రైతు సంఘం నాయకులు కారం సత్తిబాబు రైతులు పాల్గొన్నారు.










