Nov 01,2023 20:37

కాలనీవాసులతో మాట్లాడుతున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - గోనెగండ్ల
డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు నాయకులు దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం గోనెగండ్ల రెండో వార్డు బీసీ కాలనీలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. సాయంత్రం ఒంటెడుదిన్నె గ్రామంలో కొనసాగింది. వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పలుకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. బీసీ కాలనీలో దశాబ్దాలుగా డ్రెయినేజీ, సిసి రోడ్లు లేక మురుగు కాలువల నీరు, వర్షాకాలంలో వర్షపు నీరు ప్రధాన రోడ్లపైనే పారుతోందని, బీసీ కాలనీలో డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ఖాజీ-2 అబ్దుల్‌ జలీల్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడారు. 'గడపగడపకు'లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు గతంలో ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించగా, ప్రస్తుతం రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే గ్రామంలోని ఆయా వీధుల్లో గుర్తించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తాను మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిలాగా నిధులు లేకున్నప్పటికీ పనులకు భూమిపూజ చేసి టెంకాయ కొట్టి వదిలేసి రకం కాదని, టెంకాయ కొట్టి పనులు పూర్తి చేసే రకమని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2.5 కోట్లతో జల జీవన్‌ మిషన్‌ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంటింటికీ ఉచిత కుళాయి ద్వారా తాగునీటి సమస్య తీరుతుందన్నారు. వైసిపి నాయకులు టి.బందే నవాజ్‌, మన్సూర్‌, భాస్కర్‌ రెడ్డి, టి.మురళీ నాయుడు, టి.రవికుమార్‌ నాయుడు, దొరబాబు నాయుడు, గోవిందు, చికెన్‌ రాజా, బగిలి ఉస్మాన్‌, బగిలి రఫీ, పూజారి రంగస్వామి, ఎంపిడిఒ ప్రవీణ్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి సతీష్‌ పాల్గొన్నారు.