ప్రజాశక్తి-దేవరాపల్లి
మండల కేంద్రం దేవరాపల్లికి చెందిన జామి సింహచలంనాయుడు మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం రాత్రి దేవరాపల్లి పురవీధుల్లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సింహాచలం నాయుడుకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. సింహాచలంనాయుడు మృతికి కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సింహాచలంనాయుడు మృతి చెందిన 11 రోజులైనా ఇప్పటికీ ఎటువంటి విచారణ జరపకపోవడంపై దారుణమన్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపకుండా టెక్నికల్ సమస్యలు సాకుగా చూపించి మరింతగా అనుమానాలు రేకెత్తించే విధంగా వ్వవహరిస్తున్నారని తెలిపారు. కేసు నుండి దోషులను తప్పించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సింహచలంనాయుడు మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు చేపట్టకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు.










