Nov 05,2023 21:24

ఫొటో : అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

దళితులకు వైసిపి అన్యాయం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు తీవ్ర అన్యాయం చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు తెలిపారు. ఆదివారం ఆత్మకూరు బస్టాండ్‌ ఆవరణంలో ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అరాచకాలపై ఆయన మాట్లాడారు. సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం ఎప్పుడూ ఈ రాష్ట్రంలో జరగని దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, రాష్ట్రంలో ఎస్‌సి ఎస్టఇలపై జరుగుతున్నాయన్నారు. ఎన్నికల ముందు ఎస్‌సి ఎస్‌టిలకు అండగా ఉంటానని నమ్మబలికిన ఈ ప్రభుత్వం వారిపై దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వానికి 2024లో సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు.
సమన్యాయం పేరుతో ఎస్‌సి ఎస్‌టిలకు తీవ్ర అన్యాయం చేశారని దళితులపై దాడులు అత్యాచారాలు జరుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో దళితయువకుడిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి టౌన్‌ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, చండ్ర వెంకటసుబ్బానాయుడు, నాగభూషణమ్మ (మాజీ కౌన్సిలర్‌), శ్రీకాంత్‌ నారాయణ (మాజీ కౌన్సిలర్‌), ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎస్‌సి సెల్‌ నాయకులు సోమవరపు హజరత్‌, ఉదయగిరి సుధాకర్‌, జోగుంట కొండయ్య, ఆత్మకూరు తిరుపతయ్య, మనోజ్‌, సునీల్‌, పవన్‌, ప్రవీణ్‌, జనార్ధన్‌, కిరణ్‌, శ్రీను, వెంకయ్య, సాబ్జన్‌, టిడిపి నాయకులు పాల్గొని నిరసన తెలిపారు.