
ప్రజాశక్తి-అనకాపల్లి : డైట్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సౌత్ కొరియాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇరు వర్గాలు మంగళవారం అంగీకార ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ సౌత్ కొరియాకు చెందిన మస్ట్ ఫీన్ టెక్ టెక్నాలజీ సంస్థ సీఈఓ చాజూ హన్, సీటిఓ చొ ఛుంగ్ హ్యూన్, షాహిన్ ఒప్పందంలో పాల్గొన్నారని తెలిపారు. తమ విద్యార్థులు కంప్యూటర్ రంగంలో ఉపాధికి ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందన్నారు. సౌత్ కొరియా ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ తరువాత డైట్ కళాశాలతోనే ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. కళాశాల విద్యార్థులకు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ తెలుసుకొని తమ కంపెనీ నుంచి నిధులు సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ చెల్లా నరసింహం, ప్లేస్మెంట్ ఆఫీసర్ హేమంత్ కుమార్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.