
ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి -సబ్బవరం రోడ్డులో కాపుశెట్టివానిపాలెం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డు దుర్మరణం చెందారు. రూరల్ ఎస్సై నరసింగరావు కథనం ప్రకారం... కె.కోటపాడు మండలం చంద్రయ్యపేట గ్రామానికి చెందిన హోంగార్డు కుమారస్వామి సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, ఆ మృతదేహాన్ని కుమారస్వామి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కుమారస్వామి తిరిగి సబ్బవరం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్ను కొట్టడంతో తలకు బలమైన గాయం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నర్సింగరావు తెలిపారు. మృతుడు కుమారస్వామికి మృతుడికి భార్య హైమ, కుమారులు పునీత్(4), మోక్షిత్(3) ఉన్నారు.
కుమార స్వామికి ఘనంగా అంతిమ వీడ్కోలు
సబ్బవరం : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కుమారస్వామికి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. స్థానిక పోలీసులు కుమార స్వామి పార్థివ దేహాన్ని స్వగ్రామం చంద్రంపేట అప్పగించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది పోలీస్ అమర వీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ, పి.రంగనాథం తెలిపారు.