ప్రజాశక్తి-వన్టౌన్: డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్న సిఐటియు ఎన్టిఆర్ జిల్లా 11వ మహాసభను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ కోరారు. స్థానిక మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్లో మహాసభ గోడపత్రికను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15న ఉదయం వేలాది మందితో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. విజయవాడలోని మాడపాటి క్లబ్లో మధ్యాహ్నం 3.30 గంటల నుండి సభ ప్రారంభమవుతుందన్నారు. 16న జరిగే బహిరంగ సభలో రాష్ట్రానికి చెందిన సిఐటియు నాయకులు పాల్గొంటారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగాలకు అప్పజెబుతుందన్నారు. కార్పొరేటర్లకు రాయితీలు, కార్మికులు, ఇతర ప్రజానీకానికి వాతలు పెడుతోందన్నారు. నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయన్నారు.కార్మికులకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును దెబ్బతీసి, కార్మికులకు సంక్షేమ పథకాలను నిలుపుదల చేసే విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆటో, హాకర్స్, డ్రైవర్స్కు సంక్షేమ బోర్డు అమలు చేయాలన్నారు. వీటన్నిటి సాధన కోసం మహాసభలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, అధ్యక్షులుగా నేతాజీ స్కూల్ చైర్మన్ కె.తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బోయి సత్యబాబు, కోశాధికారిగా ఇ.వి.నారాయణను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వి.వెంకటేశ్వరరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి పిల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.










