Aug 30,2023 22:31

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి - శ్రీకాకుళం: వార్షిక తనిఖీల్లో భాగంగా దిశ పోలీస్‌స్టేషన్‌ను ఎస్‌పి జి.ఆర్‌ రాధిక బుధవారం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని సౌకర్యాలు, ముఖ్యమైన రికార్డుల నిర్వహణలపై లోతుగా పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దిశ పోలీస్‌స్టేషన్‌లో ఉమెన్‌ రిసెప్షన్‌ సెంటర్‌, కౌన్సెలింగ్‌ గది, వెయిటింగ్‌ షెల్టర్‌, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ, భద్రత కల్పించడమన్నారు. అందుకనుగుణంగా ప్రతిఒక్కరూ నీతి, నిబద్ధతతో విధులు నిర్వర్తించి మహిళలకు భద్రత కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో ముఖ్యంగా మహిళలపై మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. పాఠశాల, కళాశాల వద్ద దిశ బీట్‌ సిబ్బంది వాహనాలతో గస్తీ నిర్వహించి ర్యాగింగ్‌ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దిశ యాప్‌పై మహిళలు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. స్పందన పిటిషన్లు, ముఖ్యమైన కేసుల దర్యాప్తుపై దృష్టిసారించాలన్నారు. తనిఖీలో దిశ పోలీస్‌స్టేషన్‌ డిఎస్‌పి ఎస్‌.వాసుదేవ్‌, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.