ప్రజాశక్తి - సాలూరు : డిప్యూటీ సిఎం రాజన్నదొరతో జీగిరాం జ్యూట్ మిల్లు యాజమాన్య ప్రతినిధి సప్తగిరి శుక్రవారం సమావేశమయ్యారు. గురువారం అమరావతి నుంచి వచ్చిన డిప్యూటీ సిఎం రాజన్నదొరను విశాఖపట్నం గెస్ట్హౌస్లో సప్తగిరి కలిశారు. అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు కూడా చర్చల్లో పాల్గొన్నారు. 16నెలలుగా మూతపడి వున్న జ్యూట్ మిల్లు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజన్నదొర రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్,మంత్రి జయరాంకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో మిల్లు యాజమాన్య ప్రతినిధి రాజన్నదొరను కలిసి పరిస్థితిని వివరించారు. కార్మికులకు కొంత వరకు బకాయిలు చెల్లించామని, మిగిలిన బకాయిలు త్వరలో చెల్లిస్తామని యాజమాన్య ప్రతినిధి రాజన్నదొరతో చెప్పినట్లు తెలుస్తోంది. కార్మికులు ఎలాంటి అపోహలు చెందొద్దని, కొంతమంది శక్తులు కార్మికులను తప్పుతోవ పట్టిస్తున్నారని ఆయన రాజన్నదొరతో చెప్పినట్లు సమాచారం.










