Nov 01,2022 21:02

ప్రతి జనవరిలో ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని వైసిపి హామీ
మూడేళ్లు గడిచినా ఒక్క డిఎస్‌సి కూడా నిర్వహించని వైనం
40 వేల మంది బిఇడి, డిఎడ్‌ అభ్యర్థుల ఎదురుచూపు
తరగతుల విలీనం, రేషనలైజేషన్‌ పేరుతో కుప్పిగంతులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి తమ భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకుందామని భావించిన బిఇడి, డిఎడ్‌ అభ్యర్థుల ఆశలు ఆవిరైపోతున్నాయి. తాము అధికారంలోకొచ్చాక ప్రతియేటా జనవరిలో డిఎస్‌సి (ఉపాధ్యాయ నియామక పరీక్ష) నిర్వహిస్తామని వైసిపి ఇచ్చిన హామీతో అంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. వైసిపి వస్తే తమకు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఓట్లు వేసి గెలిపించారు. అధికారంలోకొచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క డిఎస్‌సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు వైసిపి సర్కార్‌ తూట్లు పొడిచింది. ఇటీవల నిర్వహించిన టెట్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఆరులక్షల మంది బిఇడి, డిఎడ్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఐదు లక్షల మంది వరకూ టెట్‌ పరీక్ష రాసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బిఇడి, డిఎడ్‌ చదువుకున్న అభ్యర్థులు దాదాపు 40 వేల మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్లతరబడి కళ్లుకాయుల కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం డిఎస్‌సి ఎప్పుడు నిర్వహిస్తుందా అంటూ కోచింగ్‌ సెంటర్ల చేరి సిద్ధమయ్యారు. 2018లో టిడిపి ప్రభుత్వం అతితక్కువ పోస్టులతో డిఎస్‌సి నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ డిఎస్‌సి నిర్వహణ అనేది లేకుండాపోయింది. ఈ కాలంలో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉద్యోగవిరమణ పొందారు. పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం డిఎస్‌సి నిర్వహించలేదు. ప్రభుత్వం నిర్వహించే డిఎస్‌సి కోసం నాలుగేళ్లుగా నిరుద్యోగులంతా ఎదురుచూస్తూనే ఉన్నారు.
రేషనలైజేషన్‌ ముసుగులో వెన్నుపోటు
విద్యావ్యవస్థలో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలను వైసిపి ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మూడు, నాలుగు తరగతులను దగ్గర్లోని హైస్కూళ్లలో విలీనం చేసింది. విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించినా బలవంతంగా ముందుకు నడిచింది. విలీనానికి ముందు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండు వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులన్నీ డిఎస్‌సి నిర్వహించి భర్తీ చేయాల్సి ఉంది. అలాకాకుండా తరగతుల విలీనం పేరుతో 117 జిఒ ఇచ్చి రేషనలైజేషన్‌ ప్రక్రియకు తెరలేపింది. దీంతో ఉపాధ్యాయ పోస్టులను కుదించి, ఖాళీలు లేవన్నట్లు ప్రభుత్వం చూపిస్తోంది. తరగతుల విలీనం ముసుగులో ఉపాధ్యాయ నియామకాలు నిర్వహించకుండా చేతులెత్తేసింది. దీంతో బిఇడి, డిఎడ్‌ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రయివేటు స్కూళ్లలో చేరినా రూ.ఐదు నుంచి రూ.పది వేలలోపే జీతం ఇస్తున్నారు. ఈ జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సాధ్యంకాని పరిస్థితి. ప్రభుత్వ కొలువు సాధించాలని ఎదురుచూస్తున్న బిఇడి, డిఎడ్‌ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉపాధ్యాయ ఉద్యోగానికి వయస్సు గడువు 39 ఏళ్లు వరకూ ఉంది. గడిచిన నాలుగేళ్లుగా డిఎస్‌సి నిర్వహణ లేకపోవడంతో చాలామంది వయస్సు పైబడి అవకాశం కోల్పోతున్నారు. ఎన్నికల్లో వైసిపి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేయవద్దని కోరుతున్నారు.