ప్రజాశక్తి-రాజవొమ్మంగి
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీశాఖ అధికారిగా జిజి నరేంద్రన్, సబ్ డివిజనల్ అధికారిగా ఎస్.భరణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. రంపచోడవరంలో నూతన కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని 11 మండలాల అటవీశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ నరేంద్రన్ మాట్లాడుతూ ఈ డివిజన్ 11 మండలాలతో పాటు, పాపికొండలు జాతీయ పార్కు, వనవిహారి, వన్య విహారి, గుడిసె తదితర ప్రాంతాలు తన పరిధిలోకి వస్తాయని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన ఫోక్స్ పేట, ఇందుకూరుపేట, మారేడుమిల్లి రేంజ్లు ఈ పరిధిలోకి వస్తాయని తెలిపారు. అటవీ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫారెస్ట్ అధికారులు డి.లలిత కుమారి, ఎం అబ్బాయి దొర, ఎం కరుణాకర్, బీవీ ప్రసాద్, వి దుర్గాకుమార్, జి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.










