
డిబిఎస్లో సి.వి.రామన్ జయంతి
ప్రజాశక్తి-కావలి : నేటి విద్యార్థులకు సర్ సి.వి. రామన్ మార్గదర్శకుడు అని డి.బి.ఎస్. ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండంట్ దామిశెట్టి సుధీర్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డి.బి.ఎస్. ఇంజనీరింగ్ కళాశాలలో సర్ సి.వి.రామన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడుతూ సర్ సి.వి.రామన్ ''రామన్ ఎఫెక్ట్''ను కనుగొని, భారత దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని తెలిపారు. తద్వారా ఆయనకు 1930లో 1954లో నోబెల్ బహుమతి, 1954లో ''భారత రత్న'' లభించిందని తెలిపారు. ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త నేటి విద్యార్థులకు ఆదర్శం కావాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి.రావు మాట్లాడుతూ సర్ సి.వి. రామన్ తన ''రామన్ ఎఫెక్ట్'' ను ధ్రువపరచిన రోజును మనం ''జాతీయ సైన్స్ దినోత్సవం''గా జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు సి.వి.రామన్ లాంటివారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, తమలోని సృజనాత్మాకతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యు.వి.సుజల, పరిపాలనాధికారి జి.రమేష్ బాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.