అవగాహన సదస్సులు.. ర్యాలీలు
ప్రజాశక్తి - యంత్రాంగం
జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా మంగళవారం డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు ముఖ్యకేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు డెంగీ కారకమైన దోమల నివారణపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు.
పెద్దాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్లో జాతీయ డెంగ్యూ నివారణ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర ప్రారంభించారు. ర్యాలీలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ మౌనిక,సానిటరీ ఇన్స్పెక్టర్ దావీదు రాజు, పిపి యూనిట్ హెచ్వి వీరలక్ష్మి, మెప్మా సీఎం ఎం.వెంకటలక్ష్మి, ఆర్పిలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుధ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కమిషనర్ కెఎ. కొండలరావు వివరించారు. కార్యక్రమంలో ఏలేశ్వరం చైర్పర్సన్ అలమండ సత్యవతి, శిడగం వెంకటేశ్వరరావు, తొండారపు రాంబాబు, మున్సిపల్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, ఎంపిహెచ్ఇఒ భాస్కరరావు, ఎస్యుఒసి హెచ్జి ఆనంద్ పాల్గొన్నారు. కరప పిహెచ్సి డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, హెచ్ వీలు, మెడికల్ సిబ్బంది డెంగీ నివారణ ర్యాలీ నిర్వహించారు. కొబ్బరి బొండాలు, కాళీ బాటిల్స్, టైర్లు, మురుగునీటి కుంటలు, డ్రైనేజీలు, వంటివి డెంగు దోమలకు ఆవాసాలుగా ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకున్నట్లయితే దోమలను నిర్మూలించు కోవచ్చని సూచించారు.
కరపలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది










