Aug 27,2023 00:24

గుంటూరు జిల్లా ప్రతినిధి: పోలీసురిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో గుంటూరు రేంజ్‌ పరిధిలో సివిల్‌ సబ్‌.ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు శనివారం నుంచి స్థానిక పోలీసు పేరేడ్‌ గ్రౌండ్స్‌లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మహిళలు,పురుషులు హాజరుఅయ్యారు. రేంజి ఐజి పాల్‌ రాజు, జిల్లా ఎస్‌పి ఆరీఫ్‌ హఫీజ్‌,బాపట్ల జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పర్యవేక్షణలో పరీక్షలునిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్‌ ఐ.జి పాల్‌రాజ్‌ మాట్లాడుతూ పరీక్షల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా పోటీలను నిర్వహించేందుకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి, ఎటువంటి ఇబ్బందులు అభ్యర్థులకు కలగకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకొని వైద్యపరమైనటు వంటి అంశాలలో తగిన ఏర్పాటు చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఎస్సై పోటీల పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు మొదటిగా డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ తర్వాత ఎత్తు, ఛాతి కొలత మరియు 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందేలాను లాంగ్‌ జంప్‌ పరీక్షలు నిర్వహించినట్టు రేంజ్‌ ఐ.జి తెలిపారు.