ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుపతి వాసులకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక రూట్ను తిరుపతి నగరపాలక సంస్థ సిద్ధం చేసింది. తిరుపతి అందాలను ఆస్వాదిస్తూ రెండంతస్తుల బస్సుల్లో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతిగా ఉండనుంది. నగరవాసులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను, సందర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న డబుల్ డెక్కర్ బస్సులున్నాయి. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు తిరుపతి నగరపాలక సంస్థ ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా నగరంలో డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించడంతో పాటు త్వరలో మరిన్ని బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నది. డిప్యూటీ మేయర్ అభినరు చొరవ మేరకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో ట్రయిల్ రన్ చేసిన కొత్త బస్సును భూమన అభినరు పరిశీలించారు. ప్రైవేట్ బస్సులకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సు తీసుకువచ్చారు. నగరానికి వచ్చిన వారు వాటిని ఆసక్తిగా చూడటమే కాదు అందులో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు. ఈ బస్సుల్లో ప్రస్తుతానికి జర్నీ ఫ్రీ, టికెట్ అవసరం లేకుండానే ప్రయాణం చేయవచ్చు. వారం రోజుల తర్వాత మినిమం ఛార్జీ విధించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరి నుంచి రూ.50లు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉంది. వీటిని చూసేందుకు కూడా జనాలు అమితాసక్తిని కనబరుస్తున్నారు. పర్యాటకుల స్పందన బట్టి మరిన్ని బస్సులు తీసుకువచ్చే ఆలోచనలో తిరుపతి నగర పాలక సంస్థ ఉంది.










