- రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ఎస్వీ జూ పార్క్ లో ఘనంగా గ్లోబల్ టైగర్ డే
ప్రజాశక్తి - క్యాంపస్ : మన రాష్ట్రం పులుల సంరక్షణలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని, శేషాచల, నల్లమల అభయారణ్యాలను కలుపుతూ కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, నేడు 50 వ గ్లోబల్ టైగర్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎస్వీ జూ పార్క్ లో గ్లోబల్ టైగర్ డే వేడుకల కు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ పులుల సంరక్షణకు రష్యాలోని జరిగిన సమావేశంలో బీజం పడిందని ఆనాటి నుండి ప్రతీ ఏడాది జులై 29న గ్లోబల్ టైగర్ డే జరుపుకుంటున్నామని అన్నారు. గత 2010లో 45 పులులు నేడు రెట్టింపుతో 80కి పైగా వున్నాయని అన్నారు. పులులు పెరగడం వల్ల అటవీ సంపద దోచుకునే వారికి భయం వుంటుందని అన్నారు. గత 12 సంవత్సరాల ముందు అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో పులుల లెక్కింపు కు శ్రీశైలం లో చిన్నపాటి లాబ్ పింగర్ ప్రింట్ ఆధారంగా చేసేవారని ఇప్పుడు శాస్త్రీయంగా కచ్చితంగా లెక్కించడానికి స్టిల్ , వీడియో, డ్రోన్ వంటి కెమెరాలు వున్నాయని అన్నారు. శేషాచల అభయారణ్యం లో నేడు పెద్ద పులులు లేవని అయితే మామండూరు వద్ద గెస్ట్ హౌస్ నందు బ్రిటిష్ వారు వేటాడినట్లురికార్డ్స్ చెబుతున్నాయని అందుకే నల్లమల, శేషాచల అభయారణ్యంలు కలుపుతూ కారిడార్ ఏర్పాటుతో నల్లమలలో వున్న పెద్ద పులులు ఇక్కడికి రావడానికి వీలుంటుందని చిరుతలు, పెద్దపులులు ఉండేవిధంగా ఏర్పాటుతో అటవీ సంరక్షణకు దోహదపడుతుంది అన్నారు. శ్రీశైలం నాగర్జునసాగర్ టైగర్ జోన్ ఇప్పుడు 8 లక్షల ఎకరాల్లో వుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో 5 లక్షల ఎకరాలు జోన్ పరిధి పెంచేలా ప్రతిపాదనలు చేశారని అన్నారు. అనతి కాలంలోనే ఈ జోన్ ప్రముఖ స్థానంలో నిలుస్తుందని అన్నారు. అటవీ సంరక్షణలో భాగస్వామ్యులయిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. ఎన్ఎస్ టి ఆర్ పుస్తకం, పోస్టర్ ఆవిష్కరణ చేశారు. వివిధ వకృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, అటవీ సంరక్షణ లో ప్రతిభ కనబరిచిన అటవీ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్వీ జూ పార్క్ లో పర్యాటకులకు కొత్తగా ఎర్పాటు చేసిన బజాజ్ బ్యాటరీ స్కూటర్ లను జెండా ఊపి ప్రారంభించారు. అటవీ అధికారులు ఉపయోగించే ఆయుధాల స్టాల్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంపిపి మోహిత్ రెడ్డి, పిసిసిఎఫ్ మధుసూధన్ రెడ్డి, అడిషనల్ పిసిసీఎఫ్ శాంతిప్రియ పాండే, సీసీఎఫ్ నాగేశ్వర రావు, జూ పార్క్ క్యూరేటర్ సి.సెల్వం, స్టేట్ సిల్వికల్చరిస్ట్ యశోదా బాయ్, తిరుపతి డిఎఫ్ఓ సతీష్ రెడ్డి, విద్యార్థులు, అటవీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










