Jul 28,2021 16:13

అమరావతి : కరోనా చికిత్స చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైపు సిలిండర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణ కోసం నిపుణులను నియమించటంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్‌, ఎసి మరమ్మతులు, ఇతర వైద్య పరికరాల అనుబంధ విభాగాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని అన్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వంద పడకలు కలిగిన ప్రైవేటు ఆస్పత్రులు మొదటి ప్రాధాన్యంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 30 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కొత్త వైద్య కళాశాలల కోసం భూ సేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ కేటాయింపులు, తక్కువ వినియోగంపై మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సిఎం జగన్‌ తెలిపారు.