Aug 01,2021 17:10

సోమల : ఓ మహిళ సొంత అల్లుడితోనే వివాహేతర సంబంధం నెరిపింది. వారి అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని అల్లుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని కంచెంవారిపల్లె సమీపంలో జరిగింది. సిఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఐరాల మండలం రంగయ్యచెరువు ఎస్‌టి కాలనీకి చెందిన నాగరాజు (51), మంజులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి కుమార్తె రాణిని బంగారుపాళ్యం మండలం చిట్టేరి ఎస్‌టి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే, అల్లుడు సుబ్రహ్యణ్యంతో మంజుల మూడేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారం రోజుల కిందట సోమల మండలం ఇర్లపల్లెలో కాపురం ఉంటున్న కుమార్తె రాణి ఇంటికి మంజుల వచ్చింది. ఆమె కోసం భర్త నాగరాజు గత ఆదివారం ఇర్లపల్లెకు వచ్చాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చేందుకు భార్య, అల్లుడు పథకం వేశారు. ఇద్దరూ కలిసి భర్తను కంచెంవారిపల్లె సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి అతిగా మద్యం తాగించారు. అనంతరం కర్రలు, రాళ్లతో కొట్టి చంపి వడ్లవాణి కుంటలో పడేసి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్‌కు పంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు మంజుల, సుబ్రహ్మణ్యాన్ని నిందితులుగా తేల్చారు. వారిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.