ఛార్జీలను వెంటనే తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి-జలదంకి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం డిమాండ్ చేసింది. స్థానిక సురే చెంచురెడ్డి భవనంలో శనివారం సిపిఎం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే ప్రతిపాదనను విరమించుకోవాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ ప్రూఫ్ కస్టమర్ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై అధిక బారాలు మోపుతుందని ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ వస్తున్న నేపథ్యంలో కరెంటు చార్జీలు తగ్గించాల్సి ఉందన్నారు. ఇందుకు భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని ఆ దానికి అప్పచెప్పేందుకు ప్రభుత్వాలు కుయుక్తులు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలకు ఆమోగ యోగ్యమైన తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఐక్య పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి మేలంగి ఆంథోని బాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు బత్తల నరసింహ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శివ శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










