Nov 08,2023 16:52

న్యూఢిల్లీ :   టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ చేపట్టనున్నట్లు బిజెపి ఎంపి పేర్కొన్నారు. మహువా మొయిత్రాపై అవినీతి నిరోధక కమిటీ లోక్‌పాల్‌ సిబిఐ విచారణకు ఆదేశించినట్లు బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే బుధవారం ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపారు. '' నా ఫిర్యాదు ఆధారంగా, దేశ భద్రతకు విఘాతం కలిగించే మహువా మొయిత్రా అవినీతిపై లోక్‌పాల్‌ సిబిఐ విచారణకు ఆదేశించారు '' అని బిజెపి ఎంపి ట్విట్‌ చేశారు.

ప్రధాని మోడీ, అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని తన తరపున పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుండి మొయిత్రా నగదు తీసుకున్నారని దూబే ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే పార్లమెంటరీ లాగిన్‌ను కూడా షేర్‌ చేయడం ద్వారా జాతీయ భద్రతకు విఘాతం కలిగించినట్లు పేర్కొన్నారు.