
ప్రజాశక్తి -భీమునిపట్నం : చట్ట సభల్లో సముచిత స్థానం దక్కేలా మనమంతా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కొండ సూర్యాచార్య అన్నారు. స్థానిక విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు యానాపు శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం స్థానికంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాచార్య మాట్లాడుతూ, స్వర్ణకారులు, కంసాలి, కార్పెంటర్లు, కమ్మరి, శిల్పులు ఒకే తాటిపైకి వచ్చి సమస్యలపై గళం ఎత్తాలని పిలుపునిచ్చారు. గత కాలపు కుల వృత్తులు నేటి జీవనానికి ఏ మాత్రం ఉపయోగకరంగా లేవని, ఉన్నత విద్య మాత్రమే ఉన్నత స్థితికి చేరుస్తుందని నొక్కి చెప్పారు. విద్య, ఉద్యోగం కోసం ఆర్థికంగా వెనుకబడిన వారికి సంఘ పరంగా శక్తి మేరకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోడి అరుణ, జిల్లా కమిటీ సభ్యులు కందిపల్లి శ్రీనివాస్, ఆవుపాటి శంకర్, దార్ల హరి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు గండిబోయిన పోలిరాజు తదితరులు పాల్గొన్నారు. కె.సన్యాసిరావును సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మాతా గోవింద మాంబ శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని సమావేశంలో నిర్వాహకులు కోరారు.