వెదురు కటింగ్ కార్మికులకు ఎఫ్ఎస్ఆర్ ప్రకారం
కూలి రెట్లు పెంపునకు అటవీశాఖ అధికారుల అంగీకారం
ప్రజాశక్తి-చింతూరు
లాంగ్ బేంబో కటింగ్ చేసే కార్మికులకు ఎఫ్ఎస్ఆర్ ప్రకారం కూలీ రేట్లు పెంచాలని 5 రోజులుగా అటవీశాఖ అధికారులతో జరుగుతున్న చర్చలు గురువారం సఫలమయ్యాయి. ఎఫ్ఎస్ఆర్ ప్రకారం కూలి రేట్లు పెంపునకు అటవీ శాఖ అధికారులు అంగీకరించారు. గురువారం తులుగొండ గ్రామంలో తులుగొండ, గొందిగూడెం, దబ్బగూడెం, గోపాలపురం, గొడ్లగూడెం, లక్కవరం, యర్రగొండపాకల గ్రామాల నుండి వచ్చిన బేంబో కటింగ్ కార్మికులు, కార్మిక నాయకులు, ఫారెస్ట్ అధికారులతో చర్చలు చేశారు. ఈ సందర్బంగా కార్మిక నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్, యర్రంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతం లాగా కింద బేంబో దొరికే పరిస్థితి లేదన్నారు. గుట్టలపైన 200 మీటర్లపై నుండి బేంబో కటింగ్ చేసి తీసుకురావల్సిన పరిస్థితి ఉందని దీనితో కార్మికులు చాలా శ్రమ చేయవలసి వస్తుందని చెప్పారు. ఏఫ్ఎస్ఆర్ 2022-2023 ప్రకారం కూలీ రేట్లు ఇచ్చి కూలీల శ్రమకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతం కంటే కూలీ రేట్లు పెంచి ఇస్తామని, ఏఫ్ఎస్ఆర్ను అమలు చేస్తామని ఫారెస్టు అధికారులు చెప్పడంతో అందరు అంగీకరించి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఒప్పందం పత్రం పై ఫారెస్ట్ అధికారులు, కార్మికులు,కార్మిక నాయకులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు శేఖర్, వెంకటేష్, కార్మిక నాయకులు చిన్నయ్య, కార్మికులు రత్తయ్య, కన్నయ్య, సింగయ్య, ఎర్రయ్య, కాంతారావు, దూలయ్య, బజారు, బ్రాహయ్య, లక్ష్మయ్య, పాపారావు తదితరులు పాల్గొన్నారు.










