Aug 29,2022 20:40

నిందితులను ప్రవేశపెట్టిన డీఎస్పీ వినోద్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలో ఈనెల 27న సంచలనం రేపిన జబ్బార్‌ జ్యువెల్లర్స్‌ దొంగతనం కేసును ఆదోని పోలీసులు ఛేదించారు. సోమవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ వినోద్‌ కుమార్‌ వివరాల మేరకు... గతంలో జబ్బార్‌ జ్యువెల్లర్స్‌లో పనిచేసిన ఫయాజ్‌ అనే యువకుడు బెంగళూరులో డూప్లికేట్‌ తాళం తయారు చేసి దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగతనానికి పాల్పడిన వారిలో మొదటి నిందితుడు బార్‌పేట్‌కు చెందిన అబ్దుల్‌ హకీం కుమారుడు ఫయాజ్‌, రెండో నిందితుడు ఫరీస్సా మొహల్లాకు చెందిన నజీర్‌ కొడుకు షేక్‌ హుస్సేన్‌, మూడో నిందితుడు జబ్బార్‌ కొడుకు దూదేకుల హఫీజ్‌ రహెమాన్‌ను ఫరీస్సామొహల్లా వద్ద అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.83 లక్షల విలువ చేసే బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్డులో హాజరుపరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన వన్‌ టౌన్‌ సిఐ విక్రమ సింహ, టూ టౌన్‌ సిఐ గుణశేఖర్‌ బాబు, త్రీ టౌన్‌ ఎస్‌ఐ పీరయ్య, వన్‌ టౌన్‌ సిబ్బంది హాజి బాష, డి.శేఖర్‌ బాబు, రామచంద్ర, హోంగార్డ్‌ ముస్తాక్‌, త్రీ టౌన్‌ సిబ్బంది సురేష్‌ నరేంద్ర, వెంకటేష్‌ను డీఎస్పీ అభినందించారు.