ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ స్థానిక విద్యావికాస్ విద్యాసంస్థల విద్యార్థులు వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. బుధవారం విద్యా వికాస్ ప్రాంగణంలో విద్యార్థులు చంద్రయాన్-3 ఆకృతిలో మానవహారం నిర్మించి, వినూత్న ప్రదర్శనతో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యావికాస్ విద్యాసంస్థల డైరెక్టర్ పి.సతీష్ చందు, కరస్పాండెంట్ వి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ చంద్రయాన్-3 విజయవంతంతో భారత ఖ్యాతి పెరుగుతుందన్నారు. భారతీయ ఇస్రో శాస్త్రవేత్తలు గతంలో ఎన్నో అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేసారని తెలిపారు. చంద్రయాన్-3 అంతరిక్ష ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపల్ ప్రసన్నలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










