
ప్రజాశక్తి-చింతపల్లి: శిక్షణతో యువతకు బంగారు భవిష్యత్తును అందించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసి ఇబ్బంది పెడుతుందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి జిసిసి మాజీ చైర్మన్ ఎం వి వి ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మండలంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య ఆధ్వర్యంలో కిటుముల పంచాయతీ పలడ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన పలడ గ్రామంలో మాట్లాడుతూ,చంద్రబాబు బయట ఉంటే రాబోవు ఎన్నికలలో వైకాపాకు ఓటమి తప్పదని గ్రహించి కుట్ర పూరితంగా ఆయనపై కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బేరా సత్యనారాయణ, పార్టీ నాయకులు పొత్తూరు రాంబాబు, లింగమూర్తి, బంగారయ్య, చిన్నాలు దొర, వనము శాంతి, సంజీవరావు పాల్గొన్నారు.