ప్రజాశక్తి-హిందూపురం : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు ఆందోళన కార్యక్రమాలు చేస్తే..సమస్యలను పరిష్కరించ డానికి చేతగాని ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కార్మికులపై దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప విమర్శించారు. ఈ నెల 7వ తేదీన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడిలో పోలీసులు కార్మికులపై చేసిన దాడులను, అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. దీనికి నిరసనగా బుధవారం సిఐటియు ఆద్వర్యంలో మున్సిపల్ పారిశుధ్యకార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో పారిశుధ్య ్య కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే పోలీసులను ఊసిగొల్పి అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణమన్నారు. ఈ నెల 17న కార్మికుల సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి పి జగదీష్, ఆనంద్, రామచంద్ర, మంజునాథ్, మూర్తి, గుర్నాద,¸్ బాలాజీ, చంద్ర, కృష్ణమూర్తి, శివ, క్లాప్ అనిల్, కవితమ్మ, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.










