ప్రజాశక్తి - కాకినాడ
సిపిఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ 1న తలపెట్టిన 'చలో విజయవాడ'ను విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జెనెరల్ సాయి శ్రీనివాస్, కాకినాడ జిల్లా ఫాప్టో చైర్మన్ చక్రవర్తి, కో చైర్మన్ కాశీ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ముద్రించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్ మాట్లాడారు. సెప్టెంబర్ 1న తలపెట్టిన వై నాట్ ఒపిఎస్ కార్యక్రమంలో భాగంగా 'చలో విజయవాడ'ను విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ హామీని తుంగలో తొక్కారాన్నరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు అంతా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ పాత పెన్షన్ కావాలని పోరాటం చేస్తుంటే మరో కొత్త పెన్షన్ను తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం సరికాదన్నారు. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తెలిపారు. సెప్టెంబర్1న విజయవాడలో జరిగే ధర్నాకు అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కలిసిరావాలన్నారు. సిపిఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా బాధ్యులు ఎస్కెవి.బాషా మాట్లాడుతూ దేశంలో హామీ ఇవ్వని రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుండగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో జిపిఎస్ అంటూ కొత్తపాట పాడటం ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. ఒపిఎస్ సాధన పోరాటానికి అన్నిఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఫ్యాప్టో చైర్మన్, కో-చైర్మన్లు చక్రవర్తి, కాశీ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ సంఘం నాయకులు చింత నారాయణమూర్తి, వెంకటేశ్వరరావు, మియా ఖాన్, కృష్ణంరాజు, అలిమ్, నందీశ్వర్, యుటిఎప్ అధ్యక్షుడు నగేష్, ప్రభాకర వర్మ, ఎస్టియు కార్యదర్శి మోర్తా శ్రీనివాస్, ఎపిటిఎఫ్ నాయకులు ఫిలిప్ రాజు, సుబ్రహ్మణ్యం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.










