కడప అర్బన్ : ఎపి విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 7న తిరుపతి కార్పొరేట్ కార్యాలయం ఎదుట చేపట్టే మహాధర్నా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా కదిలి జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని విద్యుత్ భవన్ వద్ద వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు 45శాతం ఫిట్మెంట్ పిఆర్సి ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని తెలిపారు. జెఎల్ఎం గ్రేడ్ - 2 ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కోరారు. ఇతర ప్రధాన సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులను ఇపిఎఫ్ నుంచి జిపిఎఫ్గా మార్చాలని, శ్రీ కారుణ్య నియామకాలలో అడ్డగోలు నిబంధనలు పెట్టకుండా నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి.సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి రామలింగారెడ్డి, ఎపి విద్యుత్ స్ట్రగుల్ ట్రేడ్ యూనియన్ నాయకులు శివశంకర్, సురేంద్ర, మదిలేటి, ప్రతాప రెడ్డి, మాధవరెడ్డి, కిరణ్ ,గంగన్న, విరన్న, రియజు, కేశవ పాల్గొన్నారు.










