ప్రజాశక్తి-మైలవరం: కార్మిక, కర్షక హక్కులకై ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్ కోరారు. చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కోరుతూ గురువారం స్థానిక సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య సదస్సు సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్.సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వజ్రాల వెంకటరెడ్డి, పి.నాగేశ్వరావు, పత్తిపాటి జ్యోతి, ఆర్వి పుష్పకుమారి, వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-వత్సవాయి: ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల సదస్సు కౌలు రైతుల సంఘం మండల కార్యదర్శి చిరుమామిళ్ల హనుమంతరావు అధ్యక్షతన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంపదనంతా కార్పొరేట్లకు దోచిపెడుతుందని విమర్శించారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కమల మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోన్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తమ్మినేని రాంబాబు, సిఐటియు మండల కార్యదర్శి బి.రాము, రవి, గంగుల వెంకయ్య, కూరపాటి వెంకటి, పెంటి వెంకయ్య, భూతపల్లి బిక్షం, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు నాగేశ్వరి, రైతు సంఘం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్, యేసుపోగు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-వీరులపాడు: జుజ్జూరు గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి చాట్ల రవి, ఆశా వర్కర్ నాయకురాలు కృష్ణవేణి, సిఐటియు మండల కార్యదర్శి లాల్మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.










