Nov 21,2023 21:37

బొబ్బిలి మండలంలో వరి కుప్పలపై టార్పాలిన్లు కప్పిన రైతులు

ప్రజాశక్తి-విలేకర్లు :  ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసిన రైతులకు చివరకు కష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొనగా, మరోవైపు అక్కడక్కడా పండిన వరిచేలను కోత కోసే సమయంలో పడుతున్న స్వల్ప వర్షాలు రైతులను నట్టేటా ముంచుతున్నాయి. పొలాల్లో ఉన్న వరిచేలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు.
వంగర : మండలంలో కురిసిన స్వల్ప వర్షంతో పొలాల్లో కోసి ఉన్న వరిచేలు తడిచిపోయాయి. ఈ ఏడాది వర్షా బావ పరిస్థితుల వల్ల ఎన్నో అప్పులు చేసి పొలంలో కష్టపడి వరి పంటను కొంతమేరైనా రక్షించుకోవాలని ఉద్దేశంతో చివరి దశలో మోటార్లతో నీరు తోడి కాపాడుకున్నప్పటికీ మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాలలో రైతులు తమ తమ పంటలను కోత కోసి పొలాలలోనే ఓవులుగా వేసి ఉంచారు. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఆందోళన చెందుతున్నారు.

 వంగర మండలంలో పొలంలో తడిచిన వరిచేలు
వంగర మండలంలో పొలంలో తడిచిన వరిచేలు

మెంటాడ : మండలంలో ఆకాల వర్షాల వల్ల వరి రైతులకు నష్టం వాటిల్లింది. గతమూడు రోజులుగా రైతులు వరి కోతలు మొదలుపెట్టారు. ఈ దశలో వర్షం పడడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఉరుకులు పరుగులతో పొలాల్లోనే గాలి దిబ్బలు పెట్టారు. వాటిని కప్పి ఉంచేందుకు టార్పాలిన్లు కోసం పరుగులు తీశారు.
లక్కవరపుకోట : మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కోసిన వరి చేను తడిసింది. వరి చేను పండేందుకు అవసరమైన సమయంలో వర్షాలు పడకపోయినా చెరువులు, బోరు బావులు నుండి నీరునుతోడి అతి కష్టాల మీద రైతులు వరిని పండించారు. తీరా చేతికి అందించిన వరి పంటను కోతలు కోయడంతో వర్షానికి తడిసి ముద్దయింది. చేతికి అందోచ్చిన పంట వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా 9605 ఎకరాలు సాధారణ విస్తీర్ణ ఉండగా ఈ ఏడాది 9176 ఎకరాలలో వరి పంట వేశారు. వాటిలో సుమారు 510 ఎకరాలలో పండిన వరి పంటను కోశారు. కోసిన పంటను కొన్ని ప్రాంతాలలో కుప్పలు పెట్టుకోగా మరికొన్ని చోట్ల పొలాల్లో ఆరబెట్టారు. ఆరబెట్టిన వరిచేను మాత్రమే ఉదయం నుంచి కురుస్తున్న జల్లులకు తడిచినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని స్వాతి వెల్లడించారు. కోసిన పంట 4 రోజుల వరకు ఆరబెట్టకుండా కుప్పలు వేయకూడదని రైతులకు సూచించారు. కురిసిన జల్లులకు ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు.
రేగిడి : వర్షానికి పలు గ్రామాల్లో వరి చేలు తడిసి ముద్దయ్యాయి. మండలంలో 12,662 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 3వేల ఎకరాలలో కోసిన వరిచేలు వర్షాలకు తడిశాయనివ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. రంగు మారిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలలో తక్షణమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.