Nov 02,2023 22:37

- టిడిపి యువనేత జేవి శివప్రసాద్‌ డిమాండ్‌
ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మెగా డిఎస్‌సి నిర్వహించాలని టిడిపి యువనేత జెవి శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానికి టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 45వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్‌సి నిర్వహించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. దీంతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టి కార్పొరేషన్‌లకు నిధులు మంజూరు చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు తిరగబడే రోజుల్లోనే ఉన్నాయని, మరో మారు చంద్రబాబుని సీఎం చేయడం తధ్యం అన్నారు. సమావేశంలో టిడిపి నేతలు ఉదరుకుమార్‌, ఆనంద్‌బాబు, అభి, మూర్తి, దేవేంద్రకుమార్‌, అరుల్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.