ప్రజాశక్తి-విజయవాడ : న్యూట్రిషయన్కు మిల్లట్స్ బుల్లెట్లాంటివని, భవిష్యత్ తరాలకు చిరుధాన్యాల వినియోగమే కీలకమని చిరుధాన్యాలను ఉపయోగించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. చిరుధాన్యాల వినియోగంపై గొల్లపూడిలోని టిటిడిసి భవనంలో శనివారం నిర్వహించిన మిల్లట్స్ మహోత్సవ్ 2023 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరుధాన్యాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో చిరుధాన్యాలు కీలక పాత్ర పోషిస్తున్నా యన్నారు. మన ముందు తరం వారు చిరుధాన్యాలను వినియో గంచడం వలన ఇప్పటికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. రానున్న కాలంలో చిరుధాన్యాల వినియోగమే కీలకంగా మారబోతుందన్నారు. రక్త హీనత, థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు అరికట్టేందుకు చిరుధాన్యాల వినియోగం ఎంతో దోహదపడతాయన్నారు. మన పూర్వికులు రాగి జావ, రాగి సంకటి, రాగి ముద్ద, జొన్న అన్నంలను ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలం ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారన్నారు. అనంతరం స్వయం సహాయక బృందాల మహిళలు సైనిక సంక్షేమ నిధికి సేకరించిన 4 లక్షల 17 వేల రూపాయల చెక్ను జిల్లా కలెక్టర్ డిల్లీరావు ద్వారా జిల్లా సంక్షేమ అధికారి డా. వీణాకు అందజేశారు.కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాస్, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, వ్యవసాయ శాఖ జెడి నాగమణమ్మ, జడ్పిఎన్ఎఫ్ జిల్లా పిడి విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి డా.వీణా జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు కె.సీత, స్వయం సహాయక బృందాల మండల అధ్యక్షులు, సిపిలు, ఎఫ్డివోలు, మహిళలు పాల్గొన్నారు.










