Aug 14,2023 22:33

చికిత్స పొందుతున్న చిన్నారి ఆద్య

* అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి
* దాతల సాయం కోసం ఎదురుచూపులు
ప్రజాశక్తి - కవిటి: 
ఏడు నెలల పాటు ఆడుతూ పాడుతూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారికి అనుకోని ఆపద ఎదురైంది. లేకలేక కలిగిన తమ సంతానాన్ని చూసి మురిసిపోయిన ఆ తల్లిదండ్రుల మురిపెం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కవిటి మండలం ప్రగడపుట్టుగకు చెందిన యాండ్రాపు చిరంజీవి, అంజలి దంపతుల తొమ్మిది నెలల కుమార్తె ఆద్య హెచ్‌ఎల్‌హెచ్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. జూలైలో ఆద్యకు జ్వరం రావడంతో సోంపేటలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో, శ్రీకాకుళంలోని మరో ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో, ప్రస్తుతం విశాఖపట్నంలోని గాంధీ కేన్సర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు పాప హెచ్‌ఎల్‌హెచ్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. చికిత్సకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని, చికిత్స కూడా మూడు వారాల్లోగా చేయాలని చెప్పారు. దీంతో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న ఆద్య తండ్రి చిరంజీవి దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే పాప వైద్యం కోసం రూ.మూడు లక్షలకు పైగా ఖర్చు చేశామని, ప్రస్తుతం అంత పెద్ద మొత్తం ఖర్చు చేసే ఆర్థిక స్తోమత తమకు లేదని చిరంజీవి వాపోతున్నాడు. దాతలు ఉదారంగా స్పందించి తమ బిడ్డకు ప్రాణదానం చేయాలని ప్రాధేయపడుతున్నాడు. ఫోన్‌ పే నంబరు 9515256362, ఎస్‌బిఐ అకౌంట్‌ నంబరు 11644708533, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌ 0002742కు దాతలు ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు.