Aug 29,2022 20:33

అంగన్‌వాడీ కార్యాలయం ముందు ఆడుతున్న చిన్నారులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
అంగన్‌వాడీల్లో చిన్నారుల భద్రత ప్రభుత్వానికి పట్టడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లినప్పుడు ఆడుకుంటారు. ఆ సమయంలో చిన్న, చిన్న గాయాలవుతుంటాయి. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రథమ చికిత్స కిట్లు అవసరం. ఈ కిట్లు కేంద్రాలకు రావడం లేదు.
ఆదోనిరూరల్‌ ఐసిడిఎస్‌ పరిధిలో పెద్దకడబూరు మండలంలో 55 అంగన్‌వాడీ కేంద్రాలు, ఆదోని రూరల్‌ పరిధిలో 74 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1000 నుంచి 2000 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. చిన్నారులు ఆడుకునే సమయంలో గాయాలవుతుంటాయి. చిన్నపాటి గాయాలైనప్పుడు ప్రథమ చికిత్స చేసేందుకు మందులు అవసరమవుతుంటాయి. ప్రభుత్వం ఏటా కేంద్రాలకు ప్రథమ చికిత్స కిట్లను సరఫరా చేస్తోంది. వీటిలో ఆయింట్‌మెంట్‌, కట్టువస్త్రం, దూది, జలుబు, జ్వరం, నులిపురుగుల నివారణ మాత్రలు, విరోచనాల నివారణకు సంబంధించిన మందులు వంటివి అందుబాటులో ఉంటాయి. ప్రథమ చికిత్స కిట్లు పంపిణీ చేసి ఏడాది అవుతోంది. చిన్నారులకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, గాయాలైనా చికిత్స అందించలేకపోతున్నారు. ప్రస్తుతం దగ్గు, జలుబు, జ్వరం వంటి రుగ్మతలతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు మందులు ఉంచితే కొంతమేర చిన్నారులకు ఉపశమనం కలుగుతుంది. పైగా వారి ఆరోగ్యానికి భరోసా లభిస్తుంది. కేంద్రాల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రభావం పిల్లల హాజరుపై చూపుతోంది. ఈ సమస్యపై కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. కేంద్రాలకు గతంలో ఇచ్చిన కిట్‌లో కాలం చెల్లిన ఔషధాలు ఉంటున్నాయి.