
ప్రజాశక్తి-సీతమ్మధార : మహిళా చేతన కార్యకర్త కత్తి పద్మ రచించిన కథల సంకలనం 'చీకటి పువ్వు'ను ప్రముఖ సాహితీ విమర్శకుడు వివిన మూర్తి ఆదివారం పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహితీ విమర్శకుడు జిఎస్.రామ్మోహన్ మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవనంలో ఉన్న కత్తి పద్మ రాసిన కథల విస్తృతి విశాలమైనదన్నారు. మహిళల సమస్యలపై పనిచేస్తున్న పద్మ బాధితుల జీవితాలను దర్శించే పద్ధతి విలక్షణమైనది పేర్కొన్నారు. ఆ విలక్షణత, వైవిధ్యం కథలలో కనిపిస్తాయని తెలిపారు. ఆమె కథలు వాస్తవికతను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. కధలు చదువుతుంటే పాఠకుల్లో ఆ పాత్రల పట్ల సహానుభూతి కలుగుతుందన్నారు. ప్రముఖ రచయిత్రి, న్యాయవాది జహారా మాట్లాడుతూ, సాహిత్యం బాధితుల బాధ, ద్ణుఖం ప్రతిబింబించకపోతే అది పాఠకులను హత్తుకోదని అభిప్రాయపడ్డారు. పాఠకుల హృదయాలను కదిలించే లక్షణం పద్మ రాసిన కథలకు ఉందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు వి.సంధ్య మాట్లాడుతూ, పద్మ కథలలో పాత్రలు సజీవమైనవని పేర్కొన్నారు.
'చీకటి పువ్వు' కథల ఆడియోను కథా రచయిత బమ్మిడి జగదీశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కథలు యూట్యూబ్ లో లభ్యమవుతాయి. కథల ఆడియో రూపకల్పన సందర్భంగా తమ అనుభవాలను సామాజిక కార్యకర్త వంగపల్లి పద్మ, సినీ విమర్శకులు లలిత వివరించారు.
చీకటి పువ్వు పుస్తక రచయిత కత్తి పద్మ మాట్లాడుతూ, తన కథలు ఉత్తరాంధ్ర మహిళల బాధలనూ, హృదయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. తన కథలలోని పాత్రలు విషాదాల వలయాల్లో చిక్కుకొని కూడా తమ జీవితాలను నిలబెట్టుకోవడానికీ, పరిష్కారాలను సాధించుకోవడానికి ప్రయత్నిస్తాయని చెప్పారు. చీకటి పువ్వు కథా సంకలనాన్ని మిత్ర సాహితి ప్రచురించింది. సభకు 'మిత్ర సాహితి' సభ్యుడు విశాఖ వర్మ అధ్యక్షత వహించారు.