
ప్రజాశక్తి -గాజువాక : పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని కోరుతూ తోకాడ సమైక్య అపార్ట్మెంట్, స్వర్ణ సాయి, సిరి, గ్రీన్ లైఫ్ అపార్ట్మెంట్ వాసులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు ఎ.చందన్, పి.శ్రీనివాసరాజు, ఎం.జైదేవ్, ఎం.నవీన్, తోకాడ సమైక్య అపార్ట్మెంట్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గాజువాక జోనల్ కమిషనర్ సింహాచలం కావాలనే ఐదు రోజులుగా చెత్తను తొలగించకుండా వదిలేసారని ఆరోపించారు. ఈ చెత్త నుంచి విపరీతమైన దుర్గందం వ్యాపిస్తోందని తెలిపారు. శనివారం పర్యటనకు వచ్చిన జోనల్ కమిషన్ సింహాచలం చెత్త పన్ను చెల్లిస్తే తప్ప తరలించబోమని ఖరాకండిగా చెప్పారని, అపార్ట్మెంట్ వాసులను భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారని పేర్కొన్నారు. ఆస్తి పన్ను రూపంలో రూ.లక్షల్లో చెల్లిస్తున్నామని చెప్పిన సరే జోనల్ కమిషనర్ స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా జోన్ కమిషనర్ స్పందించి అపార్ట్మెంట్లో ఉన్న చెత్తను తరలించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీరి ఆందోళనకు సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.శ్రీనివాసరావు, పిజె.రమేష్, టి.శ్రీనివాసరావు, క్రాంతి కుమార్, బి.నారాయణరావు పాల్గొన్నారు.