
ప్రజాశక్తి- అనకాపల్లి : అనకాపల్లి జిల్లా దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్నిక్ ఈఈఈ మూడవ సంవత్సరం విద్యార్థులు చెత్త మండించడం ద్వారా విద్యుత్తుత్పత్తి ప్రోజెక్టును రూపొందించినట్టు ప్రాజెక్టు ఇంజనీర్ బి.శేషగిరిరావు తెలిపారు. మనకు నిత్యజీవితంలో చెత్త ఒక భాగమైందని, ఈ చెత్త వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ఈ సమస్యకు పరిష్కారంగా చెత్తను మండిచడం ద్వారా కరెంట్ ఉత్పత్తి చెయ్యాలనే ఆలోచనతో విద్యార్థులు ఒక పరికరాన్ని తయారు చేశారని తెలిపారు. ఈ పరికరం తయారు చెయ్యడానికి కేవలం వెయ్యి రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. జె.శివ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆడారి మణికంఠ, సుస్మిత, బాషా, అంజలి, గొర్లి పవన్ కుమార్, గంటకోరు వాసు, గొంతిన లీల, మోహన్, ఐ సంజీవ వర్మ చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ చల్లా నరసింహం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు, హెచ్ఓడి గోపాలమ్మ అభినందించారు.