
ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతి పరిధి జరజాపు పేటలో కొంతల వాని చెరువు గర్భంలో ఆక్రమణలు అరికట్టాలని రైతు సంఘం నాయకులు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన కమిషనర్ బాలాజీ ప్రసాద్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా సర్వే నెంబర్ 100 కొంతల వాని చెరువు గర్భాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు జరుపుతున్నారన్నారు. ఇదే కొంతల వాని చెరువు నీటి తో సర్వే నెంబర్ 95లో ఎంతో మంది పేద రైతులు వ్యవసాయం చేస్తున్నారని ఆక్రమణకు గురైతే వారికి సాగు నీరు అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు నీటి మీద ఆధార పడి పశువులు కూడా జీవిస్తున్నాయని వాటికి కూడా నీరు అందకుండా పోతుందని తెలిపారు. కాగా చెరువు ఆక్రమణ పై పలుమార్లు తహశీల్దార్, కలెక్టర్ గ్రీవెన్స్, కమిషనర్, నీటి పారుదల శాఖ అధికార్లకు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం దారుణ మన్నారు. ఇప్పటికైన అధికార్లు స్పందించి చెరువు ఆక్రమణ నివారించి రైతులకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయించక తప్పదని హెచ్చరించారు.