
ప్రజాశక్తి - తణుకు రూరల్
విద్యార్ధినులు మంచిగా చదువుకుని దేశానికి, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వాన్బర్రీ, జనరల్ మేనేజర్, హెచ్ఒడి ఆఫ్ ఆర్అండ్డి డాక్టర్ ఎన్.విజయకుమార్ అన్నారు. స్ధానిక కళాశాల ప్రాంగణంలో ఇండ్రిస్టీయల్, ఇన్స్టిట్యూషన్ కో-ఆర్డినేషన్ కమిటీ వారు శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ రసాయన శాస్త్ర విద్యార్థినులకు ఫార్మా సూటికల్ ఇండిస్టీలో డ్రగ్ డిస్క్వరీ, క్లినికల్ ట్రైల్స్, పేటెంట్ డ్రగ్, జనరిక్ డ్రగ్ మధ్య ఉన్న బేధాలను వివరించారు. ఎంఎస్సి పూర్తయిన తరువాత విద్యార్థినులు నెట్, స్లెట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడం వల్ల జెఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, స్కాలర్షిప్లు పొందవచ్చన్నారు. వాన్బర్రీలో తయారయ్యే ఔషధాల గురించి విద్యార్థినులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో వాన్బర్రీ లిమిటెడ్, దేవి సీ ఫుడ్స్, ది ఆంధ్రా షుగర్స్ పరిశ్రమల ద్వారా అంతర్జాతీయ ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం విజయకుమార్ని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద గ్లోబల్ స్కూల్ సెక్రటరీ చిట్టూరి రీనాసాయి, రసాయనశాస్త్ర అధ్యాపకులు కెవి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.