చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
- కాటసాని తిరుపాల్ రెడ్డి
ప్రజాశక్తి - బనగానపల్లె
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని వైసిపి అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉగాది పండగను పురస్కరించుకొని కాటసాని ఓబుల్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కాటసాని తిరుపాల్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ముందుగా ఆయన బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని తెలిపారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు దోహద పడతాయని అన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ.30 వేలు, రెండవ బహుమతి రూ.20 వేలు, మూడవ బహుమతి రూ.10 వేలు ఇవ్వనున్నారని, ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ఈసారి ఎల్లయ్య, అంబటి రవి రెడ్డి, కాటసాని ఓబుల్ రెడ్డి యూత్ సుదర్శన్ రెడ్డి, అత్తార్ అఖిల్ హుస్సేన్, మమ్మదా, ఆర్గనైజర్లు మహేంద్ర, జాని, ప్రతాప్, హర్ష తదితరులు పాల్గొన్నారు.










