ప్రజాశక్తి-గుంటూరు : సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా నగరంలో చేపట్టిన గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు (జిటిఎస్), ఈ-ఆటోల ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు పనులను వేగంగా చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం సమీక్షించారు. నగరంలో సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో జిటిఎస్ల నిర్మాణ పనులను ఈఈలు భాధ్యత తీసుకొని వేగంగా చేపట్టాలని ఆదేశించారు. వార్డు సచివాలయాల వారీగా ఈ-ఆటోలు అందుబాటులోకి వచ్చినందున వాటికి అవసరమైన ఛార్జింగ్ పాయింట్స్ను అందుబాటులోని రిజర్వాయర్ పరిసరాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఆటోకు జిపిఎస్ ఏర్పాటు చేసి, ప్రతి రోజు ఆటోల ట్రిప్పుల వివరాల నివేదిక ఇవ్వాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజారోగ్య విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమోదించిన అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని, పనులను ఏఈలు ప్రత్యేక భాధ్యత తీసుకొని పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు పనుల పురోగతిపై ఈఈల వారీగా వివరాలు అడిగి తెలుసుకొని, ప్రస్తుతం తరగతులు జరుగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలన్నారు. 15వ ఆర్థిక సంఘం, ఎన్.క్యాప్ నిధులతో చేపట్టే పనులు నిర్దేశిత గడువు మేరకు జరగడం లేదని, వాటిని ఆయా ప్రాంత డిఈఈలు ప్రత్యేక శ్రద్ధతో వేగవంతం చేయాలని ఆదేశించారు. ఐలాండ్స్ పనులకు టెండర్ పొంది నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లతో ఈఈలు మాట్లాడి పనుల వేగవంతం చేయాలన్నారు. రోడ్ల విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసు కుంటూ డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఏఈలు తమ పరిధిలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు రాకుండా పర్య వేక్షించాలని, సచివాలయాల వారిగా ఎమినిటి కార్యదర్శులు పైప్లైన్ లీకులు, కలుషిత నీటి సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమావేశంలో ఎస్ఈ భాస్కర్, ఈఈలు సుం దర్రామిరెడ్డి, శాంతిరాజు, కొండారెడ్డి, కోటేశ్వ రరావు, శ్రీనివాసరావు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.










